కుటుంబసభ్యుల్లో ఆనందోత్సాహాలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
చర్లపల్లి జైలు నుంచి మొత్తం 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీల కోసం వచ్చిన కుటుంబసభ్యులతో జైలు ఆవరణలో కోలాహలం నెలకొన్నది. జైల్లో సత్ప్రవర్తన కనబర్చిన ఖైదీలను విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఖైదీలను చర్లపల్లికి తీసుకొచ్చి రిలీజ్ చేశారు. ఖైదీల విడుదలకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి ఇటీవల జీవో నెంబర్ 37 జారీ చేశారు. విడుదలైన ఖైదీల్లో జీవిత ఖైదీలతోపాటు ఇతర శిక్షలు పడిన ఖైదీలు కూడా ఉన్నారు. చాలారోజుల తర్వాత ఖైదీలు బయటికి రావడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.
కాగా, జైళ్ల శాఖ అత్యున్నత స్థాయి కమిటీ మొత్తం 231 మంది ఖైదీల విడుదలకు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో 213 మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదముద్ర వేశారు. 213 మంది ఖైదీలను విడుదల చేసినట్లు జైళ్ల శాఖ డీజీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. వివిధ జిల్లాల నుంచి ఖైదీలను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చి, అక్కడ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వృత్తినైపుణ్య శిక్షణ కూడా ఇచ్చారు. అధికారిక ప్రక్రియ అంతా పూర్తిచేసి ఇవాళ విడుదల చేశారు.
షరతులతో విడుదల..
అయితే ఖైదీలను షరతులతో విడుదల చేశారు. ఈ షరతుల ప్రకారం.. ప్రతి ఖైదీ బయటకు వెళ్ళిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని, లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని రూ.50 వేలకు వ్యక్తిగత పూచికత్తుతో బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్షను తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండడంతోపాటు, ఆ ఖైదీని విడుదల చేసిన జైలుకు ఆరు నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాలి.