తెలంగాణలో సత్ర్పవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. దీంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు ఉన్నారు. అయితే, ఒక్కొక్కరు రూ. 50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. కాగా, విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్లు సమాచారం.
వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలందరినీ చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.