ఇప్పటి వరకూ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర, సుగంధాలు వెదజల్లే చీర, దబ్బలంలో దూరే చీరలను తయారు చేసి ఓహో అనిపించారు ఆ తండ్రీ కొడుకులు. కానీ రంగులు మార్చే చీరను ఎప్పుడైనా చూశారా? తాజాగా రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరోసారి తన అద్భుత ప్రతిభను కనబరిచాడు. రంగులు మారే ఊసరవెల్లి చీరను రూపొందించి ఔరా అనిపించాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో చీర తయారు చేశాడు. ఆరున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీర రంగులు మారుస్తూ చూపరులను ఆకట్టుకుంది.
దీనికి రూ.2 లక్షల 80 వేలు ఖర్చయ్యిందని విజయ్చెప్పాడు. బంగారు, వెండి, లేత గులాబీ వర్ణాలు మారుస్తూ ఊసరవెల్లిని తలపించేలా ఉంది. 600 గ్రాముల బరువున్న ఈ చీరను తయారు చేసేందుకు తనకు నెల రోజులు పట్టిందని చేనేత కళాకారుడు నల్ల విజయ్ పేర్కొన్నాడు. ఓ వ్యాపారవేత్త ఆర్డర్ ఇవ్వడంతో రంగులు మారే చీరను తయారు చేసినట్టు తెలిపాడు. నల్ల విజయ్ తయారు చేసిన రంగులుమారే ఊసరవెల్లి చీరను హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ నేత కళను మంత్రి కేటీఆర్ అభినందిచారు.