ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 21 అడుగులకు చేరింది. చర్ల వద్ద రహదారిపైనుంచి మూడడుగుల మేరు నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో భద్రాచలంలో రోడ్లపై ముగునీరు ప్రవహిస్తున్నది.
ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం గనుల్లో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి జీకేలో 5 ఓపెన్కాస్ట్ గనుల్లో వెయ్యి టన్నులు, ఇల్లందు, కోయగూడెం ఓపెన్కాస్టుల్లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.