భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్, డీజీపీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అప్రమత్తం చేశారు. డాక్టర్లు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ను ఆదేశించారు. డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.