తెలంగాణలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక వరదల్లో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను పెంచింది. గతంలో మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించగా.. దాన్ని రూ. 5 లక్షలకు పెంచుతూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్షాలు, వరద సాయంపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
వరద ముందు బాధితులను ఆదుకోవాలని సీఎం సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలన్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు కూడా పరిహారం చెల్లించాలన్నారు.
వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తక్షణ సాయం కోరుతూ కేంద్రానికి సీఎం లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీని లేఖలో కోరారు. ఇక వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం 5 కోట్లు మంజూరు చేశారు.