భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. తాగడానికి మంచినీళ్లు లేక విలవిలలాడిపోతున్నారు. చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో రోడ్డు మార్గంలో అక్కడికి బయల్దేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు కేటాయించాలన్నారు.