(అమ్మన్యూస్, హైదరాబాద్):
బైజూస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. దేశంలో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో ఈ సంస్థ సేవలను దేశంలో చాలామంది వినియోగించుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన వద్ద వేల కోట్ల రూపాయిల సంపదతో దేశంలోని ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల మారిన పరిస్థితుల కారణంగా యన వేల కోట్ల సంపద పతనమైంది. ఆయన అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రవీంద్రన్ దగ్గర ఎటువంటి ఆస్తి లేనట్లు తెలుస్తోంది. ఆయన సంపద మొత్తం కరిగిపోయిందని ఫోర్బ్స్ సంస్థ లేటెస్ట్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం 2.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.17,545 కోట్లు. ఇప్పడు మాత్రం ఆయన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఫోర్బ్స్ వెల్లడించింది.
విస్తరణ..
ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు విస్తరించింది. వందల కొద్దీ ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంది. దీంతో బైజుస్పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. మరోవైపు సంస్థకు అప్పుల భారం ఎక్కువైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపారం పడిపోయింది. నిధుల సమీకరణ కష్టమైంది. దీంతో ఒక దశలో నిర్వహణే కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలా ఎన్నో సవాళ్ల నడుమ బైజూస్ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. సంస్థ వాల్యుయేషన్ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇటీవల అది కేవలం 200 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇటీవల కాలంలో కొన్ని ట్యూషన్ సెంటర్లను మూసేసింది. బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా కార్యాలయాలను మూసేసింది. గతేడాది బిలియనీర్ల జాబితా నుంచి నలుగురు వైదొలగగా.. వారిలో ఒకరు బైజు రవీంద్రన్ అని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.