శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరువాత హరీశ్రావే కీలకమని అన్నారు. తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ నెల 23 న అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతున్నదని ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈసారైనా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ కి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 10 ఏళ్లు ఈ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ సంపూర్ణమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అని.. వారు వస్తే నేను సంతోషిస్తానన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తన సూచనలు చేస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారని తాను కూడా మనస్ఫూర్తిగా కేసీఆర్ సభకు రావాలని ఆహ్వానిస్తున్నానన్నారు.
హరీశ్ రావుకు అపారమైన అనుభవం..
కేటీఆర్ తో ఉన్న స్నేహం వల్ల బీఆర్ఎస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చి బీజేపీ వాళ్లకు ఇవ్వలేదనే విమర్శలను స్పీకర్ ఖండించారు. ఇది అవాస్తవం అన్నారు. తనకు ఫోన్ చేసింది కేటీఆర్ కాదని హరీశ్ రావు ఫోన్ చేసి రిప్రజెంటేషన్ ఇస్తామని కోరారన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత హరీశ్ రావు కీలక నేత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు చాలా అనుభవం కలిగిన నేత, రాజకీయంగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆయన ఫోన్ చేసి తమ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై వినతిపత్రం ఇస్తామని అడగడంతో అపాయింట్ మెంట్ ఇచ్చానన్నారు.