మన్యం వీరుడి విగ్రహం పార్లమెంట్లో నెలకొల్పాలి
(అమ్మన్యూస్, హైదరాబాద్):
అల్లూరి సీతారామరాజు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి సీతక్క అన్నారు. గురువారం అల్లూరి జయంతి సందర్భంగా నగరంలోని ట్యాంక్ బండ్పై జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అల్లూరి ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి అని అన్నారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అల్లూరి అంటూ కొనియాడారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అలాంటి వీరుడి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అల్లూరి 127 జయంతి వేడుకలను నిర్వహించిన క్షత్రియ సేవా సమితి సభ్యులను మంత్రి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహ ప్రతిమతో మంత్రి సీతక్కను నిర్వాహకులు సన్మానించారు.