రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. హిందువులు దేశంలో హింస ప్రోత్సహిస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీజేవైఎం డిమాండ్ చేస్తూ.. ఈ రోజు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా గాంధీ భవన్ వైపు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మరోసారి గాంధీ భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించే క్రమంలో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు బీజేపీ నేతలపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది.