– కేసీఆర్, హరీశ్రావు ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తాం
– మీట్ ది ప్రెస్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ మునిగిపోవడం పక్కా అని, చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్రావు, కేసీఆర్ బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని సెటైర్లు వేశారు. ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్రామిరెడ్డి లాక్కున్నారన్నారు.
క్షీర సాగర్ నుంచే పని మొదలుపెడతా..
దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందని, ఐటీఐఆర్ గురించి తెలిస్తే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్లో, ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అని గుర్తుచేశారు. జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మెదక్కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ఎల్, ఇక్రిశాట్ వచ్చాయన్నారు. సమ్మిళితంగా మెదక్ ను డెవలప్ చేస్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఇవ్వనుందని స్పష్టంచేశారు. మరోవైపు ఆయన గోవధ అల్లర్లు, కంపెనీల మీద స్పందించారు. అటువంటి కంపెనీలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.