AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ.. తెలంగాణ పాలిటిక్స్‌లో మరో సంచలనం..

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే.. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ.. రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం (జులై 07న) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించటంతో పాటు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

అనంతరం.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే… ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా.. గతంలో చంద్రబాబు నేతృత్వంలో పని చేసిన టీడీపీ నేతలే కావటం గమనార్హం. ఆ కారణంగానే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ మద్దతు వారికే ఉండటంతో.. గెలుపొందారని విశ్లేషకులు వివరించారు. అందుకే.. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికీ టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మిగిలినవారిలోనూ చాలా మంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. కాగా.. అటు ఏపీలో టీడీపీ విజయం సాధించటంతో పాటు ఇటు తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు పెట్టుకోవటంతో.. తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుందనే ఉత్సాహం తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ టీడీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకునే అవకాశం కూడా ఉందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

అయితే.. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని పేర్కొంటున్నారు. ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నందుకు కలిసి శుభాకాంక్షలు తెలిపామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వర్ రావు సైతం కలిసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10