AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరుద్యోగులతో చెలగాటం ఆడింది బీఆర్‌ఎస్సే.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఫైర్‌

– నాడు విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడని హరీశ్‌రావు ఇప్పుడెలా మాట్లాడుతారు..
– హమాలీ పనులు చేసుకోవాలన్న నిరంజన్‌ రెడ్డి మాటలు ప్రజలు మరిచిపోలేదు..
– త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం
– టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం
– బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఫైర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని వెంకట్‌ బల్మూరి మండిపడ్డారు. సోమవారం నగరంలోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన మోతీలాల్‌ నాయక్‌ ఆమరణ దీక్ష చేస్తున్నాడని తెలిపారు. ఆ సోదరుడి ఆవేదన తెలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చేందుకే గాంధీ ఆసుపత్రికి వెళ్లినట్లుగా తెలిపారు. ఆనాడు రాష్ట్రంలో బోడ సునీల్, ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడినా.. మాట్లాడని బీఆర్‌ఎస్‌ నాయకులు నేడు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

అందరికీ ఉద్యోగాలు రావు హమాలీ పనులు చేసుకోవాలని నాటి మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేయడం జనం మరిచిపోలేదని అన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపై ఆందోళన చేయడానికి ధర్నా చౌక్‌ వద్దకు వెళ్లకుండా అరెస్ట్‌ అడ్డుకుంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హరీష్‌ రావు ఏదైనా మాట్లాడదలకుంటే బోడ సునీల్, ప్రవళిక ఆత్మహత్యలపై ముందు క్షమాపణ చెప్పి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మొత్తం 16 పేపర్లు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. నిరుద్యోగుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు.

డీఎస్సీ అప్లికేషన్లకు అభ్యర్థుల నుంచి కనీసం ఫీజు కూడా తీసుకోవడం లేదన్నారు. టెట్‌ విషయంలో, ఇతర అంశాల్లో నిరుద్యోగులకు సర్కార్‌ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా డీఎస్సీ వేశామని తెలిపారు. సింగరేణి జెన్కో పరీక్ష, కేంద్ర ప్రభుత్వ పరీక్షా ఒకేరోజూ ఉండటంతో జెన్కో పరీక్షను వాయిదా వేసిట్లుగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగ నిలబడేందుకు త్వరలోనే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయబోతోందని వెంకట్‌ బల్మూరి ప్రకటించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10