(అమ్మన్యూస్, హైదరాబాద్):
అహింసనే ఆయుధంగా మలచిన సమరయోధుడు, మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం ఉదయం లంగర్ హౌస్ బాపూ ఘాట్ లో నివాళులర్పించారు.
గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వి. హనుమంతరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, స్వాతంత్య్రం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. బాపూ ఆశయాలే భారత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలంటూ కొనియాడారు.
అనంతరం బాపూఘాట్లో గాంధీని స్మరిస్తూ ఏర్పాటు చేసిన కచేరీని సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు. బాపూఘాట్ కు వచ్చిన విద్యార్థులను కలిసి కరచాలనం చేశారు. బాగా చదువుకుని.. రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు.