బీజింగ్: చైనా కోస్ట్గార్డ్ సిబ్బంది రెచ్చిపోయారు. ఫిలిప్సీన్ నేవీ బోట్లపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. ఫిలిప్సీన్ బోట్ల నుంచి రైఫిల్స్ ఇతర సామగ్రిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఫిలిప్పీన్స్ సమీపంలోని సెకండ్ థామస్ షోల్ ప్రాంతం తమదేనని ఎప్పటి నుంచో చైనా వాదిస్తోంది. అక్కడ మోహరించిన ఫిలిప్పీన్స్ నౌకా దళాలకు ఆహారం, ఆయుధాలు, ఇతర సామగ్రిని చేరవేస్తున్న ఫిలిప్సీన్స్ నేవీ బోట్లపై చైనా కోస్ట్గార్డ్ దళాలు దాడి చేశాయి. ఫిలిప్పీన్స్ నౌకాదళానికి చెందిన ఎయిర్ బోట్లను వారి బోట్లతో ఢీకొట్టారు. చైనా కోస్ట్గార్డ్ సిబ్బంది గొడ్డళ్లు, కత్తులు, సుత్తులతో ఫిలిప్పీన్స్ బోట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ బోట్లలోని రైఫిల్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, చైనా కోస్ట్గార్డు సిబ్బంది దాడిలో తమ నేవీ సిబ్బంది గాయపడ్డారని, ఒకరి బొటన వేలు తెగిందని ఫిలిప్పీన్స్ సాయుధ దళాధిపతి జనరల్ రోమియో బ్రానర్ జూనియర్ తెలిపారు. చైనా సైనికులు సముద్రపు దొంగల మాదిరిగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. తమ బోట్ల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, నేవిగేషన్ పరికరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోట్లకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరారు. ఒంటి చేతితో పోరాడి, ధైర్యసాహసాలు ప్రదర్శించిన నేవీ సిబ్బందిని ప్రశంసించారు. గాయపడిన నేవీ అధికారికి మెడల్ను బహూకరించారు. చైనా దాడికి సంబంధించిన వీడియో క్లిప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.