– 13మంది కార్మికులకు తీవ్ర గాయాలు
– ఘటన పై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి
షాద్నగర్: గ్లాస్ తయారీ చేసే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల గ్రామ శివారులోని సౌత్ గ్లాస్ ప్రవేట్ లిమిటెడ్ పరిశ్రమలో చోటు చేసుకుంది. బూర్గుల గ్రామ శివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారు చేసే పరిశ్రమలో సుమారు 200 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. అయితే సాయంత్రం పరిశ్రమలో ఆటో క్లేవ్ యూనిట్ ( రెండు అద్దాలు అతికించే యూనిట్ )లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అద్దాలను గ్యాస్, వేడిమితో అతికించి తయారు చేసి వాటిని బాయిలర్ నుండి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగినప్పుడు ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదు మంది కార్మికులు పని చేస్తున్నారు. యూనిట్లో తయారు అయిన గ్లాస్ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీర భాగాలు చెల్లా చెదురుగా సుమారు వంద మీటర్లు దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరి పడింది. ఓ కార్మికుడి మృతదేహం యంత్రంలో పూర్తిగా ఇరుక్క పోయింది. పరిశ్రమలో ముగ్గురి కార్మికుల మృతదేహాలను పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. మృతదేహాల కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లా చెదురుగా పడ్డాయి.
పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ ( 25), రాం ఆశీష్ ( 18), రవుకాంత్ ( 25), రోషన్ ( 36), రతన్ దేవరియా ( 30) మృతిచెందారు. వీరితో పాటుగా బీహార్కు చెందిన గోవింద్, జార్జండ్కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సుభోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, బీహార్కు చెందిన మంటు, సమీద్కుమార్, రోషన్కుమార్, సురేంద్ర పాశ్వాన్, ఒరిస్సాకు చెందిన రేతికాంత్, రాజేష్లు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
– ఘటన పై స్పందించిన సీఎం
పరిశ్రమలో జరిగిన ఘటన పై సీయం రేవంత్రెడ్డి వెంటనే స్పందించారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ శశాంకను ఆదేశించారు.