AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం.. కత్తులతో రెచ్చిపోయిన పార్థి గ్యాంగ్‌, నలుగురి అరెస్ట్!

హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో కాల్పులు కలకలంరేపాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్‌లోని వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ఠి గ్యాంగ్ కొంతకాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను టార్గెట్ చేస్తోంది. వరుస దొంగతనాలతో నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు.. ఎస్పీ శరత్ స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ఈ దొంగల ముఠా పెట్రోలింగ్‌ పోలీసుల కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని వెంబడించారు. ఇలా ఆ గ్యాంగ్‌ను వెంటాడుతూ వస్తూ.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేశారు. పార్థి గ్యాంగ్‌లో దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు కలిసి వారిని వెంబడించారు.

ఆ దొంగల ముఠాను వెంటాడుతూ పెద్దఅంబర్‌పేట సమీపంలో.. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు రాగానే.. దొంగలు కత్తులతో పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్‌లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఈ దొంగల ముఠాలోని వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.. ఇంకా ఈ గ్యాంగ్‌‌లో ఉన్నవారిని పట్టుకునే పనిలో ఉన్నారు.

ఇటీవల హైదరాబాద్‌ చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్‌ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో కాల్పులు జరిగాయి.. కొంతకాలంగా ఈ పార్ఠి గ్యాంగ్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ గ్యాంగ్ వరుసగా చోరీలకు తెగబడుతోంది.. దీంతో పోలీసులు నిఘా పెంచారు.. వీరిపై ఫోకస్ పెట్టారు. ఇటీవల హైవేపై చోరీలు చేస్తున్నట్లు గుర్తించి.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్‌లను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే ఆ గ్యాంగ్ చోరీ చేసి పారిపోతున్న సమయంలో పోలీసుల కంటపడ్డారు.. వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇదంతా జరిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10