అమరావతి : చంద్రబాబు (Chandra Babu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందని మాజీ మంత్రి బొత్స, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీ కార్యాలయాలు, నాయకులపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరిశీలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల నుంచి ఏదేని పొరపాట్టు జరిగితే నోటీసులు ఇవ్వాలని అన్నారు . వర్సిటీల్లో వీసీలను తొలగించాలని దౌర్జన్యాలకు దిగడం తప్పని అన్నారు. విద్యాశాఖలో నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వానికి సూచించారు .
మూడువారాల్లోనే పదివేల కోట్లు అప్పు : వైసీపీ నాయకులు రవిచంద్రారెడ్డి
సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు మూడు వారాల్లోనే పదివేల కోట్ల రూపాయల అప్పులు చేశారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె. రవిచంద్రారెడ్డి ఆరోపించారు. వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఇస్తామన్న రూ. 20 వేలు , రైతులకు నిధులు ఎప్పుడిస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.