కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ . హైదరాబాద్ లోని మాదాపూర్లో రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె చెప్పిన ‘మీది మొత్తం రూ.1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి యూట్యూబర్లు, సినీ తారలు ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కడుతున్నారు. తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో ప్రముఖ స్టార్ నటుడు సోనూసూద్ సందడి చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న కుమారి ఆంటీ వద్దకు వెళ్లిన సోనూసూద్ అక్కడున్నవారందరినీ సర్ప్రైజ్ చేశారు. కుమారి ఆంటీని కలిసి శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు. అనంతరం ఆమెతో సరదాగా మాట్లాడారు. పంచ్లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. ఫుడ్ సర్వ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్ ఉదాహరణగా సోనూ సూద్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైన చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కుమారి ఆంటీని సోనూ సూద్ కలిసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.