నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు.
లావు పొలిటికల్ కెరీర్..
గుంటూరులో ఉన్న విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య కుమారుడే లావు శ్రీకృష్ణదేవరాయలు. 1983 ఏప్రిల్ 23న జన్మించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. ఆస్ట్రేలియాలో మీడియా స్టడీస్ చేశారు. 2014లో శ్రీకృష్ణదేవరాయలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో వైసీపీలో చేరి.. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై పోటీ చేసి 1,53,978 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు.