అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, నీటిపారుదలశాఖ అధికారులు హాజరయ్యారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూశాఖ అధికారుల అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్, సాగునీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలన్నారు.
వరదప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం విజ్ఞప్తి చేశారు.