AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా.. మూజువాణీ ఓటుతో ఇండియా కూటమి అభ్యర్థిపై గెలుపు

– బలరామ్‌ జాఖడ్‌ రికార్డును తిరగరాసిన బీజేపీ ఎంపీ
– రాజస్థాన్‌లో కోటా స్థానం నుంచి లోక్‌సభకు
– దాదాపు 48 ఏళ్ల తర్వాత స్పీకర్‌ పదవి కోసం ఎన్నిక

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓం బిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత స్పీకర్‌ పదవి కోసం ఎన్నిక జరగడం గమనార్హం. రాజస్థాన్‌లోని కోటా పార్లమెంట్‌ స్థానం నుంచి మూడుసార్లు ఎన్నికైన ఓం బిర్లా.. రెండోసారి లోక్‌సభ సభాపతి పదవిని చేపట్టారు. లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన రెండో వ్యక్తి ఓం బిర్లా. అంతకు ముందు బలరామ్‌ జాఖడ్‌ ఒకరు మాత్రమే వరుసగా రెండుసార్లు స్పీకర్‌ పదవిలో ఉన్నారు. ఆయన 1980 జనవరి నుంచి 1989 డిసెంబరు వరకూ (ఏడు, ఎనిమిదో లోక్‌సభ) స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. మూజవాణి ఓటు ద్వారా స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను సభాపతి సీటు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

ఏకాభిప్రాయం కుదరక..
అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత.. మిగిలిపోయిన ఏడుగురు ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీయే స్పీకర్‌ అభ్యర్ధిగా ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు మంత్రులు, బీజేపీ ఎంపీలు బలపరిచారు.

తర్వాత కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ పేరును ఇండియా కూటమి తరపున కె.సురేశ్‌ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ ప్రతిపాదించగా.. దీన్ని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహించగా.. మూజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించారు.

అభినందించిన మోదీ, రాహుల్‌..
సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలు అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో సభను విజయవంతంగా నడిపిన అనుభవం మీకు ఉందని అన్నారు. బలరామ్‌ జాఖర్‌ తర్వాత స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగలేదని, పోటీలో మీరు గెలిచి నిలిచారని ప్రశంసించారు. వచ్చే ఐదేళ్లూ సభ్యులకు మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు. సభను నడిపించడంలో స్పీకర్‌ది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.

అటు, ఇండియా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలని, సభను సజావుగా నడిపించడంలో విపక్షం మీకు సహకరిస్తుందని అన్నారు. ఇక, గతంలో నీలం సంజీవరెడ్డి, ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, జీఎంసీ బాలయోగిలు రెండుసార్లు లోక్‌సభ స్పీకర్లుగా ఉన్నా పూర్తికాలం ఐదేళ్లు పదవిలో కొనసాగలేదు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10