ఆమరణ దీక్ష చేస్తున్న మోతీలాల్కు పలువురి పరామర్శ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
గాంధీ హాస్పిటల్ వద్ద పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు సోమవారం గాంధీ హాస్పిటల్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దశలో గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డిని పోలీసు వాహనాలను ఎక్కించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు. గాంధీ హాస్పిటల్ వద్ద పోలీసుల తీరుపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్కు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.