భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు (Peddavagu) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువారం రాత్రంతా రాత్రంతా నీరు దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీఅయింది. దీంతో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.
పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2వేల కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియకపోవడంతో కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా ప్రజలు తల దాచుకున్నారు.