సుధీర్ కుమార్ చౌదరి.. ఈ పేరు వింటే ఎవరికీ అతను గుర్తు రాకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఏ మూలన భారత క్రికెట్ జట్టు ఉన్నా గ్యాలరీలో ఒక వ్యక్తి మన జాతీయ జెండా పట్టుకుని నిల్చొని ఉంటాడు. ఒంటి నిండా మువ్వెన్నల జెండా రంగులు పూసుకుని ఛాతిపై టెండూల్కర్ 10 అని రాసుకుని కనిపిస్తుంటాడు. శంఖం ఊదుతూ భారత క్రికెట్ జట్టుకు మద్దతు తెలుపుతుంటాడు. అతనే సచిన్ వీరాభిమానిగా సుపరిచితుడైన సుధీర్ కుమార్ చౌదరి.
ఎప్పటిలాగే తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్లకు హాజరయ్యాడీ సచిన్ ఫ్యాన్. ఇక 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరల్డ్ కప్ సాధించడంతో సుధీర్ ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు అతని సంతోషాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డబుల్ చేశాడు. సుధీర్ జీవితంలో మర్చిపోలేని విధంగా అతనికి ఒక సూపర సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. టీ20 వరల్డ్ కప్ జరిగిన తర్వాతి రోజు సుధీర్ ను ప్రత్యేకంగా పిలిపించాడు రోహిత్. అతని చేతికి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందించాడు. అంతేకాదు ఇద్దరు కలిసి ఫొటోలు కూడా దిగారు.