కాళేశ్వరంలో మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రివాల్వర్తో బెదిరించి హెడ్ కానిస్టేబుల్పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్సై భవానీ సేన్ను శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవానీ సేన్ను తొలగిస్తూ మల్టీజోన్ 1 ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సైగా పనిచేస్తున్న భవానీ సేన్ అదే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ రమపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెను రివాల్వర్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అప్పట్నుంచి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయిన మహిళా కానిస్టేబుల్ తాజాగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువు కావడంతో ఎస్సైపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ఎస్సైని భూపాలపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారే ఇలా అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది.