– అనారోగ్యంతో చికిత్స పొందుతూ హఠాన్మరణం
– చిరంజీవి రెండో కుమార్తె శ్రీజతో శిరీష్ ప్రేమ వివాహం
– ఆ తర్వాత కొన్నేళ్లకు విడిపోయిన జంట
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మృతిచెందారు. కొంత కాలంగా ఆయన ఊపితిత్తుల వ్యాధితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం మృతి చెందారు. 2007లో శ్రీజ– శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆర్య సమాజ్ లో జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటికే వీరికి ఒక కుమార్తె కూడా పుట్టింది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరోవైపు భరద్వాజ్ 2019లో హైదరాబాద్కు చెందిన డాక్టర్ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలోనే స్థిరపడ్డారు.
ఆ మధ్యన బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు శిరీష్ భరద్వాజ్. అయితే కొంత కాలంగా శిరీష్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కొద్ది రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే శిరీష్ కన్నుమూశారు. అయితే శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో వృతి చెందినట్టుగా అతని స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు.