తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానున్నది. ఈ నెల 21న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పథకాలకు సంబంధించి నిధుల సమీకరణ, రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించనున్నారు.
ఆగస్టు 15 లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7 వేల కోట్లు అవసరమవడంతో నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పవర్ కమిషన్ల విచారణ కాలం పెంపుపై నిర్ణయం తీసుకునే అంశంతోపాటు విభజన అంశాల్లోని 9, 10 షెడ్యూల్ కు సంబంధించిన ఆస్తులపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ భేటీలో రైతు భరోసా, రైతు రుణమాఫీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.