తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఒకరోజు వేతనం ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ మంగళవారం ఉదయం కీలక ప్రకటన చేసింది. జేఏసీ ప్రకటించిన మొత్తం విరాళం రూ.100 కోట్లు ఉంటుంది.!
కాగా.. విరాళం ప్రకటించిన వారిలో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్దారులు ఉన్నారు. వీరంతా ఒకరోజు తమ జీతంను.. సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందని లచ్చిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగుల ఉదారతకు సామాన్య ప్రజలు, వరద బాధితులు, పలు రంగాల ప్రముఖులు హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 10వేలు ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చిట్ చాట్లో భాగంగా ఈ ప్రకటన చేశారు.