బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సు, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ను నియమించేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, సర్కార్ భూమిస్తే సులభంగా కట్టవచ్చు అన్నారు. అలానే రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నామని, టెండర్లు పిలిచి మహబూబ్నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయనున్నామని తెలిపారు.