కాలి బూడిదైన జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్
విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
కొత్తగూడెం మణుగూరులో ఘటన
కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
(అమ్మన్యూస్, కొత్తగూడెం):
భద్రాద్రి కొత్తగూడెం మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్లో పిడుగు పడింది. ఈ ఘటనలో పపర్ ప్లాంట్ జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్ కాలి బూడిదైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ప్రస్తుతం ప్లాంటులో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో శనివారం పిడుగు పడింది. జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. విలువైన ఫ్లాంట్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పిడుగుపాటు కారణంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం రాష్ట్రంలోని కరెంట్ సరఫరాపై పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్లాంటులో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
నష్టంపై అంచనా..
అగ్నిప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు జరిగిన నష్టం అంచనాలు వేస్తున్నట్లు సీఈ బిచ్చన్న తెలిపారు. బీటీపీఎస్ లోని మొదటి యూనిట్కు చెందిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ (జీటీ) కు ఒక్కసారి గా మంటలు వ్యాపించాయి. మొదటి రెండు యూనిట్లను షట్ డౌన్ చేసి జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కు అంటుకున్న మంటల్ని ఫైర్ ఇంజన్ సిబ్బంది వల్ల సాధ్యం కాకపోవడంతో ఫోమ్ కెమికల్ ను వినియోగించి సుమారు గంటకు పైగా అక్కడ పనిచేసే సిబ్బంది కార్మికులు శ్రమించి మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు.
తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో కార్మికులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగ లేదు అక్కడ కార్మికులు ఉన్నట్లయితే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని తెలుస్తోంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్æ కాలిపోవడంతో నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, సాంకేతిక లోపమా పిడుగు పాటా అన్నది తేలాల్సి ఉందని ఇంజనీర్ బిచ్చన్న తెలిపారు.
మంత్రి తుమ్మల ఆరా..
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఈ బిచ్చన్న కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.