బక్రీద్ ప్రార్థనల సందర్భంగా ఈనెల 17న మాసబ్ట్యాంక్ సమీపంలోని మీరాలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్హౌజ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఉదయం 8:00 నుంచి 11:30గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మాసబ్ట్యాంక్, మీరాలం దర్గా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈద్గాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేసుకోవాలని తెలిపారు.
రేపు, ఎల్లుండి పశువుల కబేళాలు మూసివేత
బక్రీద్ పండుగ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని పశువుల కబేళాలు, రిటైల్ బీఫ్ షాపులు 17, 18 తేదీల్లో మూసివేయాలని జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు ఆదేశాలు జారీచేసింది.
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి:
డీసీపీ స్నేహామెహ్రా బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సౌత్జోన్ డీసీపీ స్నేహామెహ్రా సూచించారు. ఈమేరకు పురాణిహవేలీలోని డీసీపీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, శానిటరీ, వెటర్నరీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో ఆమె శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జంతు వ్యర్థాలను ఎత్తిపెట్టడానికి అవసరమైన కవర్లను, వాటిని పారవేయడానికి అవసరమైన టిప్పర్లు, జేసీబీ వాహనాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చూడాలని డీసీపీ సూచించారు.