AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్‌తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్ కూడా టీమిండియాతో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి 14 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ పర్యటనకు టీ20 ప్రపంచకప్ ఆడే సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండనున్నారు.

ముఖ్యంగా ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్‌కుమార్ వైశాఖ్‌, యశ్ దయాల్‌ల‌కు టీమిండియా పిలుపు వచ్చినట్లు సమాచారం.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టిన బీసీసీఐ.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త కోచ్‌గా గంభీర్ ఎంపికైనా.. అతను జింబాబ్వే పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

శ్రీలంక పర్యటనతోనే అతను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీవీఎస్ లక్ష్మణ్ అతని సపోర్ట్ స్టాఫ్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకున్న సమయంలో లక్ష్మణ్, అతని సిబ్బందే టీమిండియా‌ను పర్యవేక్షించారని, మరోసారి వారే ఈ బాధ్యతను చేపట్టనున్నారని సదరు అధికారి వెల్లడించాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10