రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సీఎం నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.